లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చర్చను ప్రారంభించిన ప్రధాని మోదీ తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశనం చేసిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వారసత్వంగా సంక్రమించిన అవినీతిని తాము పూర్తిగా రూపుమాపామని ప్రకటించారు. అలాగే అదానీ వివాదంపై ప్రతిపక్షాల విమర్శలపై సునిశితంగా చురకలు అంటించారు.
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..
- స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత నేడు గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన సమాజం గౌరవాన్ని పెంచారు.
- దీనికి ఈ దేశం మరియు సభ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
- రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అకారణంగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు, అర్ధంలేని విమర్శలు చేస్తున్నారు.
- ఒక ప్రతిపక్ష పెద్ద నాయకుడు రాష్ట్రపతిని కూడా అవమానించారు, ఎస్టీలపై తన ద్వేషాన్ని ప్రదర్శించారు.
- ఈ దేశంలోని కొంతమంది భారతదేశ ప్రగతిని సహించలేరు. ఈ క్రమంలోనే వారిలోని ద్వేషం బయటపడింది.
- మంగళవారం సభలో కొందరు నాపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలో చాలా ఉత్సాహం చూపించారు.
- వారికీ ఒకటే స్పష్టం చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎంత మద్దతు ఇస్తుందో, బడుగు వర్గాల వారి క్షేమానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది.
- ఒకప్పుడు భారత్ సమస్యల పరిష్కారం కోసం ఇతరులపై ఆధారపడుతుండేది.
- కానీ మేము దానిని మార్చాం. ఇప్పుడు తన సమస్యలను తానే పరిష్కరించుకునే స్థాయికి చేరింది.
- కోవిడ్ మహమ్మారి ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మేము నిజాయితీగా ప్రయత్నించాం.
- ఈ ప్రయత్నంలో భారతదేశంలో ఒక్కొక్కటి 6-7,000 కోట్లు విలువ కలిగిన 108 యూనికార్న్ల ఏర్పాటుకు ప్రోత్సహించాం.
- గత తొమ్మిదేళ్లలో, భారతదేశంలో 90,000 స్టార్టప్లు పుట్టుకొచ్చాయి.
- స్టార్టప్ల విషయంలో మనం ఇప్పుడు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం.
- అలాగే భారతదేశం యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలు కొన్ని వేగవంతమైన పురోగతిని సాధించింది.
- ప్రపంచమంతా డిజిటల్ ఇండియాను గుర్తించింది, నేడు ప్రతి గ్లోబల్ ఆర్గనైజేషన్ భారత్పై విశ్వాసం ప్రదర్శిస్తోంది.
- మన దేశం ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు మరియు కొత్త అవకాశాల సృష్టి దిశగా అడుగులు వేస్తోంది.
- నేడు భారతదేశంలో అత్యంత సుస్థిర ప్రభుత్వం ఉంది. ఇది జాతి మొత్తానికి ప్రతినిధిగా మాత్రమే కాదు, అండగా కూడా ఉంటుంది.
- నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
- కానీ మనదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది, దీనికి ప్రతి ఒక్క భారతీయుడూ గర్విస్తున్నాడు.
- ప్రధానంగా ఈ ఏడాది భారత్ నేతృత్వంలో జీ-20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నాం, ఇది 140 కోట్ల మంది భారతీయులకు గొప్ప గర్వకారణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE