ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా?’ అని విజయసాయి రెడ్డి కేంద్రాన్ని వివరణ అడగగా, దీనికి కేంద్రం తరపున నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని, 2015లోనే దీనిని నోటిఫై చేసినట్లు తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ను అనుసరించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిపారు.
రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని, ఇక ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం 2020లో మూడు రాజధానుల బిల్లుని తెచ్చిందని, కానీ ఈ బిల్లు తెచ్చే ముందు కేంద్రాన్ని సంప్రదించలేదని కూడా ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్త రాజధాని కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, అధ్యయనం తర్వాత నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం అధ్యయన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, దీని ప్రకారమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE