ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, 2015 నుండి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్టిస్(JustIS) మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్ మరియు S3WaaS వెబ్సైట్లు వంటి వివిధ కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రొ.ఎస్ పి. బాఘెల్, భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా మరియు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 1949లో ఈ రోజున స్వతంత్ర భారతదేశం కొత్త భవిష్యత్తుకు పునాది వేసుకున్నదని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంవత్సరంలో రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని గుర్తుచేస్తూ, బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ నివాళులర్పించారు. భారత రాజ్యాంగం అభివృద్ధి మరియు విస్తరణలో గత 70 దశాబ్దాల ప్రయాణంలో లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక శాఖకు చెందిన అసంఖ్యాక వ్యక్తులు అందించిన సేవలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ ప్రత్యేక సందర్భంగా దేశం తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశం జరుపుకుంటున్న సమయంలో భారతదేశ చరిత్రలో చీకటి రోజును గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ, నవంబర్ 26న భారతదేశం తన చరిత్రలో శత్రువుల ద్వారా అతిపెద్ద ఉగ్రవాద దాడిని ఎదుర్కొందని అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో, ప్రపంచం భారత్ను ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ ప్రతిష్టల మధ్య ఆశతో చూస్తోందని ప్రధాని అన్నారు. భారతదేశం తన స్థిరత్వం గురించి మొదట్లో ఉన్న భయాందోళనలన్నింటినీ ధిక్కరిస్తూ, ప్రస్తుతం పూర్తి శక్తితో ముందుకు సాగుతోందని, దాని వైవిధ్యంలో గర్వపడుతున్నదని అన్నారు. ఈ విజయానికి రాజ్యాంగం కారణమన్నారు. పీఠికలోని మొదటి మూడు పదాలైన ‘వి ది పీపుల్’ ను ప్రధాని ప్రస్తావిస్తూ, వి ది పీపుల్ అనేది ఒక పిలుపు, విశ్వాసం మరియు ప్రమాణం అని పేర్కొన్నారు. రాజ్యాంగం యొక్క ఈ స్ఫూర్తి భారతదేశం యొక్క ఆత్మ అని, ఇది ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లి అని అన్నారు. “ఆధునిక కాలంలో, రాజ్యాంగం దేశం యొక్క అన్ని సాంస్కృతిక మరియు నైతిక భావోద్వేగాలను స్వీకరించింది” అని చెప్పారు. ప్రజాస్వామ్య మాతగా దేశం రాజ్యాంగంలోని ఆదర్శాలను బలోపేతం చేస్తోందని, ప్రజానుకూల విధానాలు దేశంలోని పేదలకు, మహిళలకు సాధికారత కల్పిస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. సామాన్య పౌరులకు చట్టాలు సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని, సకాలంలో న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థ అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
వారం రోజుల్లో భారతదేశం జీ-20 అధ్యక్ష పదవిని చేజిక్కించుకోబోతోందని ప్రధాని తెలిపారు. ఒక జట్టుగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను మరియు ఖ్యాతిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “ఇది మన సమిష్టి బాధ్యత”, “ప్రజాస్వామ్య మాతృమూర్తిగా భారతదేశం యొక్క గుర్తింపును మరింత బలోపేతం చేయాలి” అని అన్నారు. యువత కేంద్రీకృత స్ఫూర్తిని ప్రస్తావిస్తూ, రాజ్యాంగం దాని బహిరంగత, భవిష్యత్తు మరియు ఆధునిక దృక్పథానికి ప్రసిద్ధి చెందిందని ప్రధాని అన్నారు. భారతదేశ వృద్ధి కథనంలోని అన్ని అంశాలలో యువశక్తి పాత్ర మరియు సహకారాన్ని ప్రధాని గుర్తు చేశారు. సమానత్వం మరియు సాధికారత వంటి అంశాలపై మరింత మెరుగైన అవగాహన కోసం యువతలో భారత రాజ్యాంగంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE