ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 29, శుక్రవారం) ఉదయం చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 69 మంది గోల్డ్ మెడలిస్ట్స్ కు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను ప్రధాని మోదీ అందజేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ముందుగా డిగ్రీలు పొందిన విద్యార్థులను అభినందించారు.
“అన్నా యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ఈరోజు గ్రాడ్యుయేషన్ పొందిన వారందరికీ అభినందనలు. మీరు ఇప్పటికే మీ మనస్సులలో మీ కోసం భవిష్యత్తును నిర్మించుకున్నారు. అందువల్ల ఈరోజు కేవలం విజయాల రోజు మాత్రమే కాదు, ఆకాంక్షల రోజు కూడా” అని ప్రధాని అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను, విశ్వవిద్యాలయంలోని లెక్చరర్స్ మరియు బోధనేతర సిబ్బంది మద్దతును కూడా ప్రధాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద భారతదేశంలోని యువతలో ఉన్న అవకాశాల గురించి చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రపంచం మొత్తం భారతదేశ యువతను ఆశగా చూస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎందుకంటే యువత దేశానికి వృద్ధి ఇంజిన్లు మరియు భారతదేశం ప్రపంచానికి వృద్ధి ఇంజిన్ అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే అన్నా యూనివర్శిటీతో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు మరియు విలువలు ఎల్లప్పుడూ మీకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ఊహించని సంఘటన అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది శతాబ్దానికి ఒకసారి వచ్చే సంక్షోభం, దీని కోసం ఎవరి వద్ద యూజర్ మాన్యువల్ లేదు. ఇది ప్రతి దేశాన్ని పరీక్షించింది. ఎదురయ్యే ప్రతికూలతలు మనం దేనితో తయారయ్యామో తెలియజేస్తాయని వ్యాఖ్యానించారు. భారతదేశం తెలియని వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది, అందుకు శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు సాధారణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితంగా భారతదేశంలోని ప్రతి రంగం కొత్త జీవితంతో కళకళలాడుతుందని, పరిశ్రమలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు లేదా అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ భారతదేశాన్ని ముందంజలో చూస్తున్నాయన్నారు. గత ఏడాది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ నిలిచిందని ప్రధాని చెప్పారు. ఇన్నోవేషన్ అనేది జీవన విధానంగా మారుతోంది. గత 6 ఏళ్లలో గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 15,000 శాతం పెరిగింది. గత ఏడాది భారత్కు రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ వచ్చింది. మహమ్మారి తర్వాత మన స్టార్టప్లకు కూడా రికార్డు స్థాయిలో నిధులు వచ్చాయి. వీటన్నింటికీ మించి, అంతర్జాతీయ వాణిజ్య డైనమిక్స్లో భారతదేశ స్థానం అత్యుత్తమంగా ఉంది. ఇక యువత మరియు దేశ ప్రగతికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. “యువత ఎదుగుదల భారతదేశ వృద్ధి. యువత అభ్యాసాలు భారతదేశం యొక్క అభ్యాసాలు. యువత విజయం భారతదేశ విజయం” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY