భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఆయన ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇక ఏపీ విలీన మండలాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు గుండాల గ్రామంలో వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఐదు విలీన గ్రామాల సమస్య తాత్కాలికమే అని, టీడీపీ అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపుతుందని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ వర్షాలు, వరదలపై ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పేవని అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల భద్రత కోసం భద్రాచలం వద్ద గోదావరి నదికి కరకట్ట నిర్మించామని, దాని వల్లే ఈరోజు పట్టణానికి పెనుప్రమాదం తప్పిందని ఆయన గుర్తు చేశారు. నాయకులుగా ఉన్నవారు ఎప్పుడైనా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని, అప్పుడే ప్రజలకు మేలు కలుగుతుందని చంద్రబాబు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ