యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) నూతన ప్రధానమంత్రిగా ఎన్నికై భారతీయ సంతతి నేత రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కు మొదటి బ్రిటీష్-ఆసియన్ పీఎంగా మరియు అతి పిన్న వయస్సులోనే పీఎంగా ఎన్నికైన నేతగా 42 ఏళ్ల రిషి సునాక్ ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన పీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న రిషి సునాక్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “హృదయపూర్వక అభినందనలు రిషి సునక్. మీరు యూకే ప్రధానమంత్రి అయినప్పుడు, నేను ప్రపంచ సమస్యలపై సన్నిహితంగా కలిసి పనిచేయడానికి మరియు రోడ్మ్యాప్ 2030ని అమలు చేయడానికి ఎదురుచూస్తున్నాను. యూకేలో ఉన్న భారతీయులకు ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు. ఇరు దేశాల ఉన్న చారిత్రాత్మక బంధాన్ని ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుందాం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ముందుగా బ్రిటన్ ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ అక్టోబర్ 20న తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదవీ చేపట్టిన కేవలం 45 రోజులకే ఆమె రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా లిజ్ ట్రస్ నిలిచారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన అనంతరం తదుపరి బ్రిటన్ ప్రధాని కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పై లిజ్ ట్రస్ విజయం సాధించారు. కాగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమం/మినీ బడ్జెట్ బ్రిటన్ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దకపోగా మార్కెట్లకు షాక్వేవ్లను పంపింది, దీంతో ఆమె కన్జర్వేటివ్ పార్టీలో కూడా విబేధాలు మొదలయ్యాయి. ఆమె విధానాలు విమర్శలకు గురవడం, ఈ క్రమంలో ఒత్తిడి పెరగడంతో లిజ్ ట్రస్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూకేలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎంపికవడంతో పాటుగా బ్రిటన్ తదుపరి పీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY