మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 30, సోమవారం నాడు కొత్తగా 36 మంది మంత్రులతో మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. కేబినెట్ లో చోటు దక్కిన 36మంది మంత్రులతో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో నవాబ్ మాలిక్, ధనుంజయ్ ముండే, రాజేష్ తోపే, జితేంద్ర అహ్వాద్, విజయ్ వాడెత్తివార్, దిలీప్ పాటిల్, అమిత్ దేశ్ ముఖ్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ, శివసేన నుంచి చెరో 13 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులకు త్వరలోనే శాఖలను కేటాయించనున్నారు. ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 32 రోజుల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువు తీరడం విశేషం.
[subscribe]