దేశంలో మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా కేసుల పెరుగుదల, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కట్టడికి మెరుగైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో నమోదైన కేసుల్లో 96% కంటే ఎక్కువమంది కోలుకున్నారని, ప్రపంచంలో కరోనా మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు పలు కరోనా వేవ్స్ ను ఎదుర్కోవలసి వచ్చిందని, తాజాగా భారత్ లో కూడా కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కేసులు పెరగడం మొదలయ్యాయని అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందని చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ ను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి:
ఇప్పటివరకు తీసుకున్న అనేక జాగ్రత్తలతో సేఫ్ జోన్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా మళ్ళీ కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందన్నారు. దేశంలోని 70 జిల్లాల్లో గత కొన్ని వారాల్లో 150% కంటే ఎక్కువగా కరోనా కేసులు పెరిగాయని, ఈ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని ఆపకపోతే, దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా వ్యాప్తి చెందే పరిస్థితి రావచ్చుని చెప్పారు. ఇప్పుడిప్పుడే దేశంలో మొదలవుతున్న కరోనా సెకండ్ వేవ్ ను వెంటనే ఆపాలని, అందుకోసం త్వరితగతిన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
కరోనా కట్టడి పట్ల ఉన్న విశ్వాసం ఆత్మవిశ్వాసంగా మారకూడదని, ఇప్పటివరకు కరోనాపై చేసిన పోరాటం నిర్లక్ష్యంగా మారకూడదని చెప్పారు. అలాగని ప్రజల్లో భయానక వాతావరణం కల్పించాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు, విధివిధానాల ద్వారా కరోనా ఇబ్బందుల నుంచి ప్రజలను విముక్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా అవసరమైన చోట మైక్రో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా వ్యాక్సిన్ డోసులు వృధా అవుతున్నాయని, వ్యాక్సిన్ ఎందుకు వృధా అవుతుందో ఆయా రాష్ట్రాల్లో సమీక్ష జరపాలన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ