భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ 105 జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు, సీపీపీ చైర్మన్ సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత భూపిందర్ హుడా సహా పలువురు పార్టీ నాయకులు శనివారం ఉదయం ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ పేరుతో జరిగిన ’75 సంవత్సరాల స్వాతంత్య్రం’ అనే ప్రత్యేక కార్యక్రమానికి మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ హాజరయ్యారు.
మరోవైపు ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ఉదయం ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, ఈ రోజు యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, “స్వాతంత్య్ర పోరాటంలో పెరిగారు, భారతదేశంలోని గొప్ప నాయకుల నుండి నేర్చుకున్నారు, తండ్రికి ప్రియమైనవారు. దేశానికి దుర్గ, శత్రువులకు కాళి – భయం లేనిది, తేజస్విని, ప్రియదర్శిని” అని ఇందిరాగాంధీని స్మరించుకున్నారు. అలాగే “105వ జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటూ… భారతదేశం యొక్క ఇందిర ధైర్యానికి పర్యాయపదం – ధనవంతుల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టిన, పేదల కోసం శ్రద్ధ వహించిన, గాజు పైకప్పులను పగలగొట్టిన మరియు భారతదేశ ప్రయోజనాలను నిర్ధారించడానికి శక్తివంతమైన దేశాలను ధిక్కరించిన ప్రధానమంత్రి” అని కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతా నుంచి ట్వీట్ చేసింది.
అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. ప్రధాని ట్వీట్ చేస్తూ, “మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE