ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 11వ విడత నిధులను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు దాదాపు రూ.21000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద 11వ విడత కింద 10 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో నేడు రూ.2000 చొప్పున జమ కానున్నాయి. ఈ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారు రైతులతో ప్రధాని మోదీ సంభాషించారు. షిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, హిమాచల్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, మరియు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, పీఎం కిసాన్ పథకం ద్వారా 10 కోట్ల మందికి పైగా రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను పొందారని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనాలను షిమ్లా నుండి దేశవ్యాప్తంగా విడుదల చేయడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో 130 కోట్ల మంది పౌరులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం కింద ప్రయోజనాలను విడుదల చేయడం పట్ల కూడా ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF