దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చి కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ కుంభమేళాలో ఏప్రిల్ 12, 14 తేదీల్లో షాహీ స్నాన్ల సందర్భంగా పవిత్ర స్నానాలు పూర్తయ్యాయి. మరోవైపు ఇక్కడ ఇప్పటికే 1700 మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో కుంభమేళా నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు స్పందించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపాలంటూ సాధువులను కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“ఆచార్య మహమండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి జితో ఈ రోజు ఫోన్లో మాట్లాడాను. సాధువులందరి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాను. సాధువులందరూ పరిపాలన యంత్రాగానికి అన్ని రకాల మద్దతు ఇస్తున్నారు. దీనికి సాధువు ప్రపంచానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండు షాహీ స్నాన్ ఇప్పటికే పూర్తయ్యాయి. కరోనా సంక్షోభం కారణంగా కుంభ్ (పాల్గొనడం) ప్రతీకాత్మకంగా జరపాలని ప్రార్ధించాను. ఈ నిర్ణయం ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి బలాన్ని ఇస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ సూచన అనంతరం స్వామి అవధేశానంద్ గిరి స్పందించారు. “ప్రధాని మోదీ విజ్ఞప్తిని మేము గౌరవిస్తాము. జీవితాన్ని రక్షించడం గొప్ప ధర్మం. కరోనా పరిస్థితి నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో స్నాన్ కోసం రాకూడదని మరియు అన్ని నియమాలను పాటించాలని ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా కార్యక్రమం సాధారణంగా జనవరి నెల మధ్య నుండి ఏప్రిల్ వరకు జరుగుతుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా కుంభమేళాను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి 30 వరకు నిర్వహించేలా కుదించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ