గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పోరేటర్ గా భారతీయ జనతా పార్టీ తరపున గెలుపొందిన ఆకుల రమేశ్ గౌడ్ మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ చేసిన విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 న జరగనున్న ఉపఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఆకుల రమేశ్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేశ్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అన్నారు. వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలిసి రావాలని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ కోరారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ