దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం జరగనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కావడం ఇది ఐదోసారి. గత సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే పాల్గొనగా, నేటి సమావేశంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే మూడు విడతలుగా లాక్డౌన్ విధించారు. మూడో విడత లాక్డౌన్ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండంతో సీఎంలతో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఒకవైపు రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరోవైపు పూర్తిస్థాయి కార్యకలాపాలు ఆగిపోయి దేశ ఆర్ధికవ్యవస్థపై భారం పడుతుండడంతో లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేత లేదా కొనసాగించడమా అనే విషయంపై చర్చించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, ఆర్ధిక పరిస్థితులు, స్థానిక పరిస్థితులపై సీఎంలతో చర్చించి, ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే వ్యూహాలపై భవిష్యత్ కార్యచరణ రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నటుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu