జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ముందు స్కోల్జ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీతో పాటు ఇతర మంత్రులను కలిశారు. కాగా ఛాన్సలర్ స్కోల్జ్ పర్యటన బహుముఖ భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడానికి ఒక అవకాశం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. ఉక్రెయిన్ వివాదం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు మరియు ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాల గురించి స్కోల్జ్, ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపనున్నారని తెలిపింది. ఇది కొత్త సాంకేతికతలు, స్వచ్ఛమైన ఇంధనం మరియు వాణిజ్యం మరియు పెట్టుబడులతో సహా అనేక కీలక రంగాలలో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక జర్మనీ ఛాన్సలర్ పదవిలో 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఏంజెలా మెర్కెల్ పదవీకాలం తర్వాత 2021 డిసెంబర్లో స్కోల్జ్ జర్మన్ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జర్మనీ ఛాన్సలర్గా స్కోల్జ్ భారతదేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జాయింట్ ప్రెస్మీట్లో స్కోల్జ్ ప్రసంగిస్తూ.. ‘మేము ఇప్పటికే జర్మనీ మరియు భారతదేశం మధ్య మంచి సంబంధాలను కలిగి ఉన్నాము. అలాగే ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తామని భావిస్తున్నాను. మన రెండు దేశాల అభివృద్ధికి మరియు ప్రపంచంలో శాంతికి సంబంధించిన అన్ని అంశాల గురించి మేము చర్చిస్తాము’ అని తెలిపారు. ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారత్, జర్మనీల మధ్య సంబంధాలు రెండు దేశాల మధ్య లోతైన అవగాహనపై ఆధారపడి ఉన్నాయి. మాకు వాణిజ్య మార్పిడి చరిత్ర ఉంది. యూరప్లో జర్మనీ మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE