ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 27, సోమవారం మధ్యాహ్నం బెలగావిలో జరగనున్న కార్యక్రమంలో పీఎం-కిసాన్ పథకం 13వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8 కోట్లకుపైగా రైతు లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ(డీబీటీ) ద్వారా పీఎం-కిసాన్ 13వ విడత కింద రూ.16,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ జమ చేయనున్నారు.
ముందుగా ఫిబ్రవరి 24, 2019న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి రైతుల సంక్షేమం పట్ల నిబద్ధత చూపుతూ, దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరంలో నాలుగు నెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డీబీటీ విధానం ద్వారా డబ్బును జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 12 విడతల నిధులను రైతుల ఖాతాల్లో జమచేయగా, 13వ విడత కింద ప్రధాని మోదీ ఫిబ్రవరి 27న రూ.16,000 కోట్ల నిధులను విడుదల చేసి, అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు.
మరోవైపు బెలగావి పర్యటనలో భాగంగా రూ.2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటుగా, మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని సదుపాయాలతో పునరభివృద్ది చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE