జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ దాడిలో అమరులైన వారికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. ‘ గత ఏడాది జరిగిన దారుణమైన పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ధైర్య అమరవీరులకు నివాళులు. వారు మన దేశానికి సేవ చేయడానికి మరియు మనల్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు. ఈ అమరవీరుల త్యాగాలను భారతదేశం ఎప్పటికీ మరచిపోదని’ ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో స్పందిస్తూ ‘ 2019 లో ఇదే రోజు పుల్వామాలో జరిగిన దారుణమైన దాడిలో అమరవీరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాం. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఐక్యంగా నిలబడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నామని’ పేర్కొన్నారు.
అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పుల్వామా అమరులకు నివాళులర్పించారు. ‘పుల్వామా దాడిలో అమరవీరులకు నేను నివాళులర్పించాను. మన మాతృభూమి సార్వభౌమాధికారం మరియు సమగ్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన మన ధైర్యవంతులకు మరియు వారి కుటుంబాలకు భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుందని’ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్ధం దాడి జరిగిన ప్రాంతమైన జమ్ముకశ్మీర్లోని లెత్పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తూపంపై 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోలను ముద్రించారు. ఈ స్మారక స్తూపం ప్రారంభోత్సవ కార్యకమానికి ప్రత్యేక అతిధిగా మహారాష్ట్ర నుంచి ఉమేష్ గోపినాథ్ జాదవ్ హాజరయ్యారు.
[subscribe]