ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్ చర్యలపై పలు కీలక అంశాలను అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల్లో మొత్తం 37,441 బెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రోజుకి 2,462 సాధారణ బెడ్లు, 11,177 ఆక్సిజన్ సపోర్టు బెడ్స్, 2,651 ఐసీయూ బెడ్లు ఖాళీగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మరోవైపు కోవిడ్ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాల గురించి కూడా చర్చించారు. మొత్తం అవసరమైన 30,887 పోస్టులకు, ఇప్పటికే 21,673 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేశామని చెప్పారు.
రెగ్యులర్ రిక్రూట్మెంట్లో భాగంగా 9,971 పోస్టులకుగాను 4,676 పోస్టుల నియామకం పూర్తవగా, 5,295 పోస్టుల కోసం భర్తీ ప్రక్రియ నడుస్తుందని తెలిపారు. కోవిడ్ చికిత్స, ఇతర సంబంధిత అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రతిరోజూ రూ.10.18 కోట్లు ఖర్చు చేస్తోందని అధికారులు వెల్లడించారు. కరోనా పరీక్షల నిర్ధారణ కోసం రూ.4.3 కోట్లు, కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఆహారం కోసం రూ.1.31 కోట్లు, చికిత్సలో భాగంగా మందులు కోసం రూ.4.57 కోట్లు ఖర్చవుతోందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లను పెట్టాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రులపై సమీక్ష నిర్వహించిన విధంగానే ఆరోగ్యశ్రీ, ఎంపానల్డ్ ఆసుపత్రులపై సమీక్ష చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu