దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 190 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 19, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మార్చ్ 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల సహకారంతో సైరన్ మోగించాలని చెప్పారు. సైరన్ మోగిన సమయంలో ప్రజలందరూ వారి వారి ఇళ్ళల్లో గుమ్మాలు, బాల్కనీలో నిల్చుని చప్పట్లు కొడుతూ కరోనాతో పోరాడుతున్న వారికి, సేవ చేస్తున్న డాక్టర్లకు సంఘీభావం తెలియ చేద్దాం అని చెప్పారు.
ప్రపంచ మానవాళి అంతా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ అన్నారు. గత రెండు నెలలుగా కరోనా వైరస్ గురించి వింటున్నామని, ప్రస్తుతం మనదేశంలో కూడా క్రమంగా వ్యాపిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలుతో వ్యవహరించాలని, ఈ కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా యుద్ధం చేయాలని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుందని, ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ ను రూపుమాపడానికి ఇంకా ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని అన్నారు.
” వచ్చే రెండు వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. మన ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి దృఢ సంకల్పం, రెండోది కలిసి పోరాడటామని ” అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని కోరారు. 60 నుంచి 65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రానివ్వవద్దని ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఒకరి నుంచి ఒకరు పరస్పరం దూరం పాటిస్తూ ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసే దిశగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ప్రజల అవసరాల దృష్ట్యా నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నివారణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయని, దేశ ప్రజల సహకారంతో భారత్ ఈ వైరస్ ను ధైర్యంగా ఎదుర్కొని జయిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.