దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, హర్యానా, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులుతో రేపు (ఏప్రిల్ 27, బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గోననున్నారు. అలాగే ఈ సందర్భంగా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ తీరుపై ప్రధాని మోదీకి అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
దేశంలో మార్చి 2020లో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లతో ప్రధాని మోదీ అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించి కరోనాను కట్టడి చేయడం, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కీలక సూచనలు చేశారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తితో మొదలైన కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చినట్టే వచ్చి, తాజాగా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడంతో మరోసారి సీఎంలతో సమావేశం అవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించడం, సాధారణ ఆంక్షల విధింపు, సంబంధిత విషయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ