ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం కీలక ప్రకటన చేశారు. బీహార్ రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీని ప్రారంభించబోనని, ఒకవేళ జన్ సూరజ్ ప్రచారంలో చేరిన వ్యక్తులు పార్టీ పెట్టేలా డిమాండ్ చేస్తే, అందులో తాను సభ్యుడిగా ఉంటానని పేర్కొన్నాడు. ప్రజలను వారి ఇళ్ల వద్దే కలుసుకుని వారి బాధలను అర్థం చేసుకునే దిశగా, ప్రజల కోసం పని చేస్తానని గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి బీహార్ లోని పశ్చిమ చంపారన్లో గల మహాత్మా గాంధీ భితిహర్వా ఆశ్రమం నుండి 3,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారి సమిష్టి పాలనలో బీహార్ భారతదేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటిగా మారిందన్నారు. బీహార్కు కొత్త ఆలోచనలు, ప్రయత్నాలు అవసరమని, ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కానీ, ఏదైనా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కానీ లేదని, బీహార్ యే ఇప్పుడు తన మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. బీహార్లో సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవని, కొత్త రాజకీయ పార్టీపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఒకవేళ జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీ పెడితే అది తన పేరుతో ఉండదని, ఆ పార్టీని స్థాపించే వారికి సహకరిస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
మరోవైపు ఇటీవల పలుమార్లు కాంగ్రెస్ పార్టీతో చర్చల అనంతరం పార్టీలో చేరడంపై ప్రశాంత్ కిషోర్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపవర్డ్ గ్రూప్ లో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తన ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ కు తనకంటే లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరివర్తన సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ