అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 1303 మంది మరణించారు. మరోవైపు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,08,571 కు చేరగా, ఇప్పటివరకు 56,521 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే ఈ వైరస్ నుంచి 1,13,380 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27, సోమవారం రాత్రి వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వలన అమెరికాలో మృతుల సంఖ్య 70 వేలకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికాలో కరోనా వలన ఇంతమంది మరణించాక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అమెరికా అధ్యక్షుడుగా మీరు ఎన్నిక అవ్వడానికి అర్హులేనా అనే విలేఖరి ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ, ముందుగా 2.2 మిలియన్లు కరోనా మరణాల నమోదు అవుతాయని అంచనా వేశామని, అయితే ఆ సంఖ్య 70 వేల వరకే పరిమితమవనుందని చెప్పారు. ఈ రెండు అంచనాల్లో చాలా వృత్యాసం ఉందన్నారు. దేశంలో కరోనా కట్టడికి మంచి నిర్ణయాలే తీసుకున్నానని భావిస్తున్నాని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వెంటనే సరిహద్దులను మూసివేయడం, చైనా నుంచి ప్రయాణికులను నిషేధించడం వంటి పెద్ద నిర్ణయాలే తీసుకున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu