భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (జనవరి 10, మంగళవారం) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. అలాగే ఈ కన్వెన్షన్ సందర్భంగా, రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖి మరియు కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశం కానున్నారు. ముందుగా మంగళవారం మధ్యాహ్నం ఇండోర్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ స్వాగతం పలికారు.
ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) కన్వెన్షన్ అనేది భారత ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్ కాగా, ఇది విదేశీ భారతీయులతో కలవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి, డయాస్పోరా ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకోవడానికి ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది. 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో జనవరి 8న ఇండోర్లో ప్రారంభం కాగా, నేటితో (జనవరి 10 ముగియనుంది. ఈ పీబీడీ కన్వెన్షన్ యొక్క థీమ్ ను “డయాస్పోరా: అమృత్ కాల్లో భారతదేశం యొక్క పురోగతికి విశ్వసనీయ భాగస్వాములు” గా పేర్కొన్నారు. దాదాపు 70 విభిన్న దేశాల నుండి 3,500 మంది ప్రవాస సభ్యులు పీబీడీ కన్వెన్షన్ కోసం నమోదు చేసుకున్నారు.
ముందుగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోర్లో పర్యటించి 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘సురక్షిత్ జాయేన్, ప్రశిక్షిత్ జాయేన్’ అనే స్మారక పోస్టల్ స్టాంప్ను కూడా ప్రధాని విడుదల చేశారు. అలాగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రవాసుల సహకారం’ అనే అంశంపై మొట్టమొదటి డిజిటల్ పీబీడీ ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE