పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్పూర్ ర్యాలీ భద్రతా కారణాల రీత్యా రద్దు కావడం కాక రేపుతోంది. నిరసనకారుల అడ్డగింతతో ప్రధాని తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. అయితే, ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10 వేల మంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని.. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్టు సీఎం చన్నీ తెలిపారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. ‘‘వాస్తవానికి ప్రధానిని పంజాబ్లో ఎవరూ అడ్డుకోలేదు. భారతీయ జనతా పార్టీ నేతలు 70,000 మందితో అక్కడ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ, అక్కడికి 700 మంది కూడా రాలేదు. అందుకే, ప్రధాని మోదీ వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని బయటికి చెప్పలేక పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో భద్రతా సమస్య లేనే లేదు. ప్రధాని రావాలి అనుకుంటే హెలికాప్టర్ ద్వారా అయినా రావచ్చు. బీజేపీ నిర్వహించిన సభకు ఎవరూ రాలేదనే కారణంతోనే ర్యాలీని రద్దు చేసుకున్నారు” అని చరణ్జిత్ సింగ్ చన్నీ ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ