ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఉదమ్సింగ్ నగర్ జిల్లా, ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గానికి పుష్కర్ సింగ్ ధామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బలమైన అభ్యర్థికి నాయకత్వ అప్పగించే క్రమంలోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పుష్కర్ సింగ్ ధామి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తుంది.
సీఎంగా ఖరారైన అనంతరం ఆయన రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ కీలక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ముందు పెద్ద సవాల్ ఉందని, అందరి మద్దతు తీసుకుని, పార్టీని ముందుకు తీసుకువెళతానని అన్నారు. ముందుగా శుక్రవారం రాత్రి అనూహ్య పరిణామాల మధ్య తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల సమయంలోనే ఉత్తరాఖండ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం విశేషం. మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర 10వ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఆదివారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ