కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 22న పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు తానూ పోటీలో ఉండనున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఉదయం ప్రకటించారు. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లిన అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, అధ్యక్ష పదవి కోసం పోటీపడేందుకు తాను నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేసినందువలన అధ్యక్ష పదవిని అంగీకరించాల్సిందిగా రాహుల్ గాంధీని అభ్యర్థిస్తానని గతంలోనే చెప్పానని, అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడిగా ఉండరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. కొన్ని కారణాల వల్ల పోటీలో ఉండొద్దనే నిర్ణయాన్ని రాహుల్ తీసుకున్నారని, గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ఈసారి పార్టీ అధ్యక్షుడు అవుతారని రాహుల్ గాంధీ పేర్కొన్నట్టు అశోక్ గెహ్లాట్ తెలిపారు.
ఇక పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి త్వరలో తేదీని ప్రకటిస్తానని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఎన్నిక అనంతరం తాను పార్టీ అధ్యక్షుడైతే, తదుపరి చర్యలను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శివిర్లో తీసుకున్న ‘ఒక్క వ్యక్తి, ఒకే పదవి’ వంటి నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఉదయ్పూర్లో మేము ఏ నిర్ణయం తీసుకున్నామో, ఆ నిబద్ధతను కొనసాగించాలని మేము ఆశిస్తున్నామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ క్రమంలోనే అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడైతే రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీ అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ మధ్యనే ఉండే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY