అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సహా మొత్తం 175 మంది ప్రముఖులు, వీరితో పాటుగా సాధువులు, మత పెద్దలు, స్థానికులు హాజరు కానున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు ముందుగానే అందరిని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే సాధువులకు భూమిపూజ కోసం కంచి కామకోటి పీఠం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు పంపిన వెండి నాణేలను అందించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరగనుంది. అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. కోట్లాది హిందువుల ఏళ్ల కల సాకారమవుతున్న వేళ, రామమందిరం భూమిపూజకు గొప్ప స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో స్థానికులు, ఇతర ప్రాంతాల వారు అయోధ్యకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు.
రామమందిరం ఏర్పాటుకు కీలక పోరాటం చేసిన బీజేపీ అగ్రనేత అద్వానీ భూమిపూజ సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. మందిర నిర్మాణం తనతో పాటు భారత ప్రజలందరికీ చారిత్రక, ఉద్వేగభరిత క్షణమన్నారు. దృఢమైన, శాంతి సామరస్యంతో కూడిన భారతదేశానికి రామ మందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను అద్వానీ గుర్తు చేసుకున్నారు.
అయోధ్యలో ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్ఎస్జీ కమాండోలుతో కలిపి దాదాపు 4 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది అయోధ్యలో విధులు నిర్వహించనున్నారు. అలాగే అయోధ్యలో భూమిపూజ నేపథ్యంలో దేశంలో హైదరాబాద్ సహా పలు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం నుంచే సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu