రష్యా సోమవారం ఉక్రెయిన్కు పీడకలను మిగిల్చింది. శక్తివంతమైన క్షిపణులతో దేశంలోని పలు నగరాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా పలు అనేక నగరాలపై డజన్ల కొద్దీ మిస్సైల్ దాడులు చేసింది. దాదాపు 75 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. కాగా ఈ దాడుల్లో సుమారు 8 మంది మృతి చెందారని, మరో 24 మంది వరకు గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. అలాగే 15 వాహనాలు ధ్వంసం అయినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు. మెట్రో స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద మరియు పార్కింగ్ గ్యారేజీల లోపల ఆశ్రయం కోసం ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు. భారీ పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో వీధుల వెంట పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు.
కాగా రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. ‘వారు ఉక్రెయిన్ ప్రజలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ గడ్డ నుండి మమ్మల్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు’ అని టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్లోని పశ్చిమాన ఉన్న ఎల్వివ్, టెర్నోపిల్ మరియు జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్లోని డ్నిప్రో మరియు క్రెమెన్చుక్, దక్షిణాన జాపోరిజ్జియా మరియు తూర్పున ఖార్కివ్లలో పేలుళ్లు సంభవించాయని, అయితే ఈ క్రమంలో రష్యాకు చెందిన 41 మందిని తమ వైమానిక దళం కాల్చి చంపిందని జనరల్ వాలెరీ జలుజ్నీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక గత రెండు రోజల క్రితం రష్యా-క్రిమియాను కలిపే కీలక బ్రిడ్జ్పై బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రష్యా.. దానికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్లు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY