భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. దేశం ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. ఉదయపూర్లో ఒక దర్జీ హత్యకు గురైన దురదృష్టకర సంఘటనకు ఆమె అత్యుత్సాహమే కారణమని పేర్కొంది. తన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ, తనకు ప్రాణహాని ఉందన్న కారణంగా దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. అయితే దీనికి సుప్రీం నిరాకరించడంతో ఆమె తన పిటిషన్ను ఉపసంహరించుకుంది.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే, ఆ వ్యక్తిని అరెస్టు చేస్తారు. కానీ మీ పలుకుబడిని చూసి మిమ్మల్ని తాకడానికి ఎవరూ సాహసించరు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో నుపుర్ శర్మ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు నూపుర్ శర్మ తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఆమె మీడియా ముఖంగానే (టీవీలో) దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.
దీనికి ముందు ఉదయ్పూర్లో టైలర్ను నరికి చంపిన ఇద్దరు వ్యక్తులను గురువారం రాత్రి అజ్మీర్లోని అత్యంత భద్రత గల జైలుకు తీసుకువచ్చారు. నుపుర్ శర్మకు మద్దతుగా కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణతో ఉదయపూర్లో దర్జీ కన్హయ్య లాల్ను ఇద్దరు వ్యక్తులు తల నరికి చంపడం దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులు రియాజ్ అక్తరీ, గౌస్ మహ్మద్ రియాజ్ 47 ఏళ్ల కన్హయ్య లాల్పై పదునైన ఆయుధంతో దాడి చేసి మొబైల్ ఫోన్లో నేరాన్ని రికార్డ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ