భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ బన్సల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం లభించడంతో ఫిబ్రవరి 13, గురువారం నాడు రాజీవ్ బన్సల్ను కొత్త సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎండీగా ఉన్న అశ్వనీ లొహానీ పదవీ కాలం ముగియటంతో, ఆయన స్థానంలో బన్సల్ ను నియమించారు. రాజీవ్ బన్సల్ 1988 బ్యాచ్కు చెందిన నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా పౌర విమానయాన శాఖలో పనిచేసిన అనుభవం బన్సల్ కు ఉంది. 2006 నుంచి 2008 వరకు ఆయన పౌర విమానయాన శాఖలో పనిచేశారు. అలాగే 2017లో ఎయిరిండియా సీఎండీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
[subscribe]