దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25, శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దేశంలో 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు జనవరి 3, 2022 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించబడుతుందని చెప్పారు. ఈ నిర్ణయం కోవిడ్ పై దేశం యొక్క పోరాటాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల ఆందోళనను కూడా తగ్గిస్తుందని అన్నారు.
అలాగే కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో హెల్త్కేర్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్లు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇప్పటికీ కూడా వారు ఎక్కువ సమయం కోవిడ్ రోగులకు సేవ చేస్తూనే ఉన్నారన్నారు. అందువలన ముందుజాగ్రత్త దృష్ట్యా, హెల్త్కేర్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు కూడా జనవరి 10,2022 నుంచి ప్రికాషన్ డోస్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
మరోవైపు వయసు పైబడిన వారు మరియు ఇప్పటికే కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ‘ప్రికాషన్ డోస్’ తీసుకోవడం మంచిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 60 ఏళ్లు వయసు పైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారు వారి యొక్క వైద్యుల సలహాపై ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అనుమతించబడతారని చెప్పారు. వారికీ కూడా ప్రికాషన్ డోస్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుందన్నారు. ఇక కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తరిస్తోందని, దేశంలో కూడా చాలా మందికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారని అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఎవరూ భయాందోళనలు చెందవద్దని, జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా కోరారు. మాస్క్లు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకూడదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ