కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈ రోజు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ఉండడం వలన, ఈ పిటిషన్ నిష్ప్రయోజనముగా మారిందని, ఇక చెల్లదని కోర్టు తెలిపింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా ఆ గడువు నేటితో ముగియనుంది.
చిదంబరం అరెస్ట్ కంటే ముందుగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, అందువలన విచారణ జరపాలని చిదంబరం తరపు న్యాయవాది ఈ రోజు సుప్రీం కోర్టుకు వివరించారు. ఈ వివరణకు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిదంబరం అరెస్ట్ అయినందువలన ఇప్పుడు ఈ పిటిషన్ కు అర్హత లేదని చెప్పారు. ఇంకో వైపు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ, చిదంబరం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసారు. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించలేదు. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతనే విచారణ చేపడతామని చిదంబరం తరపు న్యాయవాదులకు ధర్మాసనం తెలియజేసినట్టు తెలుస్తుంది.
[subscribe]
[youtube_video videoid=n3KQjkWfYRg]