ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తనను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించి, ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన విచారణపై స్టే విధించాలని కోరుతూ విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తున్నట్టు ఫిబ్రవరి 18, మంగళవారం నాడు కోర్టు ప్రకటించింది. హోలీ సెలవుల అనంతరం మార్చి నెలలో మళ్లీ విచారణ జరపనున్నట్టు తెలిపింది. విజయ్ మాల్యా మార్చి 2016లో భారత్ వదిలి వెళ్లిపోయి అప్పటి నుండి యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నారు. ఇటీవల యూకేలో ఆయన రిపోర్టర్లతో మాట్లాడుతూ, సీబీఐ, ఈడీ సహా భారత విచారణ సంస్థలన్నీ గత నాలుగు సంవత్సరాలుగా తనపై అకారణంగా విచారణ చేస్తున్నాయని అన్నారు. అలాగే తనకు ఇచ్చిన అసలు డబ్బులో వందశాతాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, వెంటనే వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరారు.
[subscribe]