కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్లె లీతో జరిగిన పోరులో పీవీ సింధు పూర్తి ఆధిపత్యంతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మిచెల్లె లీపై 21-15, 21-13 తేడాతో పీవీ సింధు అద్భుత విజయాన్ని సాధించి, స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. సింధుకి కామన్ వెల్త్ గేమ్స్ లో ఇదే స్వర్ణ పతకం. గతంలో 2014లో కాంస్యం మరియు 2018లో రజత పతాకాన్ని సింధు గెలుచుకుంది. కాగా సింధు సాధించిన స్వర్ణంతో కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరగా, మొత్తం పతకాల సంఖ్య 56కు చేరింది.
పీవీ సింధు కామన్ వెల్త్ గేమ్స్లో చారిత్రాత్మక బ్యాడ్మింటన్ స్వర్ణం గెలుచుకోవడం ద్వారా దేశం హృదయాన్ని గెలుచుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సింధు కోర్టులో మాయాజాలం సృష్టించిందని, లక్షలాది మందిని ఆకర్షించారని అన్నారు. సింధు అద్భుత విజయం బర్మింగ్హామ్లో మన జాతీయ జెండా ఎగరడానికి, మన జాతీయ గీతం ప్రతిధ్వనించేలా చేసిందని, ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, “అసాధారణమైన పీవీ సింధు ఛాంపియన్లలో ఛాంపియన్. ఎక్సెలెన్స్ అంటే ఏమిటో ఆమె పదే పదే చూపుతుంది. ఆమె అంకితభావం మరియు నిబద్ధత విస్మయం కలిగిస్తుంది. కామన్ వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆమెకు అభినందనలు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
అలాగే కామన్ వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి, ఆమెను అభినందించారు.
పీవీ సింధు మెడల్స్:
- 2016 రియో ఒలింపిక్స్ లో రజతం
- 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం
- కామన్ వెల్త్ గేమ్స్ (2014-కాంస్యం, 2018-రజతం, 2022-స్వర్ణం)
- బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ (2013-కాంస్యం, 2014-కాంస్యం, 2017-రజతం, 2018-రజతం , 2019-స్వర్ణం)
- ఆసియన్ గేమ్స్ (2018-రజతం).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY