వారం క్రితం తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు కెప్టెన్ వరుణ్ సింగ్. తీవ్రంగా కాలిన గాయాలతో వరుణ్ సింగ్ బెంగళూరులో చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన కూడా ప్రాణాలు వదలటం బాధాకరం. దీంతో ఆ రోజు హెలికాప్టర్ లో ప్రయాణించిన అందరూ ప్రాణాలు కోల్పోయినట్లయింది.
ఈ వివరాలను ఐఏఎఫ్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్లో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. ఆ ప్రమాదం తరువాత వరుణ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని తెలిపింది. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ