భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ మరియు వాషింగ్టన్ సుందర్ తదితరులు సోమవారం ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. న్యూజిలాండ్తో మూడో వన్డే కోసం జట్టు మధ్యప్రదేశ్ చేరుకోగా.. ఈ క్రమంలో వీరు జట్టు సిబ్బందితో కలిసి ఉదయాన్నే ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ సహచర ఆటగాడు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని మహాకాళేశ్వర ఆలయంలో భస్మ హారతి పూజ చేశామని తెలిపాడు. పంత్ పునరాగమనం భారత జట్టుకు చాలా ముఖ్యమైనదని, అందుకే అతను త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థించామని పేర్కొన్నాడు. ఇప్పటికే న్యూజిలాండ్తో సిరీస్ గెలిచామని గుర్తుచేసిన సూర్యకుమార్, ఈ క్రమంలో రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో చివరి మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
కాగా డిసెంబరు 30వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు డివైడర్ను ఢీకొనడంతో భయంకరమైన ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగగా అదృష్టవశాత్తూ రిషభ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో పంత్ నుదురు మరియు వీపుపై పెద్ద గాయాలు అయ్యాయి. అలాగే అతని కుడి మోకాలికి ఫ్రాక్చర్ కాగా.. కుడి మణికట్టు, చీలమండ, బొటనవేలు కూడా గాయపడింది. దీంతో మెరుగైన వైద్యం కోసం పంత్ను డెహ్రాడూన్ నుండి ముంబైకి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లు అతడు కోలుకోవాలంటూ ఉజ్జయిని ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE