స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు నేతాజీకి నివాళులు అర్పించి, ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు.
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఈ రోజు పరాక్రమ్ దివస్ సందర్భంగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పిస్తున్నాను మరియు భారతదేశ చరిత్రకు ఆయన చేసిన అసమానమైన కృషిని గుర్తుచేసుకుంటున్నాను. వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన తీవ్ర ప్రతిఘటన వలన ఎప్పటికి గుర్తుంచుకోబడతారు. ఆయన ఆలోచనల ద్వారా లోతుగా ప్రభావితమై, భారతదేశం పట్ల ఆయన విజన్ ను సాకారం చేసేందుకు మేము కృషి చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి భవన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “పరాక్రమ్ దివస్ నాడు, మనం భారత మాత యొక్క గొప్ప కుమారులలో ఒకరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పిస్తున్నాము. నేతాజీ అసాధారణమైన ధైర్యాన్ని మరియు దేశభక్తిని ప్రతిబింబిస్తారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. భారతీయులు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు” అని పేర్కొన్నారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “తన అద్వితీయ నాయకత్వ సామర్థ్యంతో నేతాజీ ప్రజలను సంఘటితం చేసి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ని ఏర్పాటు చేయడం ద్వారా స్వేచ్ఛ కోసం సాయుధ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆయన ధైర్యానికి, పోరాటానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. ఈరోజు నేతాజీ 126వ జయంతి సందర్భంగా, దేశప్రజలకు ‘పరాక్రమ్ దివస్’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE