రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య మార్చి 1న ఉక్రెయిన్లోని ఖార్కివ్లో రష్యా సైన్యం జరిపిన దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం సోమవారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. ఈరోజు ఉదయమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వైద్య విద్యార్థి కుటుంబ సభ్యులు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విమానాశ్రయానికి చేరుకున్నారు.. నవీన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి అనంతరం కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. నవీన్ మృతదేహంతో కూడిన విమానం తెల్లవారుజామున 3:00 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం, కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని అతని స్వగ్రామానికి తరలించారు. “ఉక్రెయిన్లో దాడిలో మరణించిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, దాడిలో మేము అతనిని కోల్పోవడం దురదృష్టకరం” అని బొమ్మై విమానాశ్రయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్, MBBS విద్యార్థి. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థి ఆహారం కొనుక్కోవడానికి క్యూలో నిల్చున్నప్పుడు రష్యా సైన్యం జరిపిన దాడిలో మరణించాడు. కర్ణాటక ముఖ్యమంత్రి నవీన్ శేఖరప్ప కుటుంబానికి ₹ 25 లక్షల చెక్కును అందజేసి, కుటుంబ సభ్యునికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు శనివారం నవీన్ తండ్రి శంకరప్ప మాట్లాడుతూ.. తమ కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. “నా కొడుకు వైద్య రంగంలో ఏదైనా సాధించాలనుకున్నాడు, అది జరగలేదు. కనీసం అతని శరీరాన్ని ఇతర వైద్య విద్యార్థులు చదువుకోడానికి ఉపయోగించవచ్చు. అందుకే ఇంట్లో మేము అతని శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాము” నవీన్ తండ్రి చెప్పాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ