పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31, మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ అఖిలపక్ష సమావేశంలో 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు పాల్గొన్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అఖిల పక్ష సమావేశం బాగా జరిగిందని, పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా నడిపేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు/ప్రతిపక్షాల సహకారాన్ని కోరామని తెలిపారు. అలాగే నిబంధనలు మరియు విధానాల ప్రకారం పార్లమెంటులో ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై కేంద్రమంత్రులు, పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే పలు రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు కీలక సూచనలు చేసి, చర్చించినట్టు తెలుస్తుంది.
ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ లతో పాటుగా టీఎంసీ నుంచి సుదీప్ బంద్యోపాధ్యాయ, సుఖేందు శేఖర్ రే, బీఆర్ఎస్ నుంచి కె.కేశవ రావు, నామా నాగేశ్వరరావు, డీఎంకే నుంచి టీఆర్ బాలు, వైస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డి, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి ప్రొఫెసర్ మనోజ్ ఝా, జేడీయూ నుంచి రామ్ నాథ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. కాగా అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా కాంగ్రెస్ అగ్రనేతలు గైర్హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ మరియు పార్టీ సీనియర్ నాయకులు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు గైర్హాజరయినట్టు తెలుస్తుంది.
మరోవైపు మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ముందుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి దశ బడ్జెట్ సమావేశాలు జరుగనుండగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, బుధవారం ఉదయం కేంద్ర బడ్జెట్ 2023-24 ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE