తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమైంది. కాగా బహుళైచ్ఛిక సమాధానాలు కలిగిన 7 ప్రశ్నలకు సంబంధించి అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో టీఎస్ఎల్ పీఆర్బీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 7 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండటంతో అభ్యర్థులు ఒక్కో సమాధానాన్ని ఎంచుకున్నారు. అయితే రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం తాము నిర్ణయించుకున్న జవాబుల ప్రకారమే మార్కులు వేసి ఫలితాలు వెల్లడించింది.
దీంతో ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాల్సిందిగా రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. దీంతో గతంలో ఈ 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులు పొందలేని కారణంగా ఫెయిల్ అయినవారు తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఉత్తీర్ణులవనున్నారు. హైకోర్టు తీర్పుపై ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తీర్ణులైన వారి జాబితాను రేపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వారికి త్వరలోనే దేహదారుఢ్య (పార్ట్-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో దేహదారుఢ్య పరీక్షకు ఈ నెల 30వ తేదీ నుంచి వెబ్సైట్లో లాగిన్ అయి పార్ట్-2 దరఖాస్తును సమర్పించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్-2 దరఖాస్తును సమర్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన హాల్టికెట్లను ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఇక ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబదాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్ఎల్పీఆర్బీ కసరత్తు చేస్తోంది. అయితే ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించి ఇప్పటికే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ పూర్తి చేసిన వారికి అవసరం లేదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE