కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర పార్టీల అధినేతలు, ప్రతినిధులు పలువురు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలలో, ద్రవిడ మున్నేట్ర కజగం, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐఎం), జార్ఖండ్ ముక్తి మోర్చా మరియు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నాయకులు కూడా శ్రీనగర్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కాశ్మీర్లో నాపై దాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే అందరూ భయపడినట్లు ఇక్కడి ప్రజలు నాకు హ్యాండ్ గ్రెనేడ్లు ఇవ్వలేదు, షేక్ హాండ్స్ ఇచ్చారు. అంతేకాకుండా నా హృదయాన్ని వారు ప్రేమతో నింపారు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఇలా అన్నారు.. ‘జమ్మూ కాశ్మీర్లో బీజేపీ సభ్యులు భయపడి నడవలేకపోతున్నారు. పుల్వామా దాడిలో తమ బంధువులను కోల్పోయిన వారి బాధను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే మా తండ్రి రాజీవ్గాంధీని, నానమ్మ ఇందిరా గాంధీని కూడా మేము ఇలాగే కోల్పోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. మా పూర్వీకులు కాశ్మీర్ నుంచే వచ్చారు, కాశ్మీర్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది పేదవారిని చూసి నా మనసు కరిగిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు వారి ఆవేదనలను నాతో పంచుకున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది’ అని హామీ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్థానిక సంప్రదాయ కశ్మీరీ ఫేరాన్ను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు ఈరోజు శ్రీనగర్లో భారీ హిమపాతం కురుస్తోంది. అయినాసరే రాహుల్ గాంధీ మంచు వర్షం పడుతున్న సమయంలో కూడా తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. అంతకుముందు, ఈ ఉదయం తన సోదరి ప్రియాంక మరియు చుట్టుపక్కల వారిపై రాహుల్ మంచు విసురుతూ, ఆట పట్టిస్తూ కొద్దిసేపు సందడి చేశారు. ఈ దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. దేశవ్యాప్తంగా ఇవి వైరల్ అయ్యాయి.
కాగా సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మొత్తం 12 రాష్ట్రాలు సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 4,080 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన 12 బహిరంగ సభలు, 100కి పైగా కార్నర్ మీటింగ్లు మరియు 13 విలేకరుల సమావేశాలలో ప్రసంగించారు. అలాగే మరో 275 వాకింగ్ ఇంటరాక్షన్లు మరియు 100 కంటే ఎక్కువ సిట్టింగ్ ఇంటరాక్షన్లలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో యాత్ర మధ్యలో ఎంతోమంది రాజకీయ నేతలతో పాటు అనేకమంది సినీ, క్రీడా ప్రముఖులు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అలాగే యాత్ర ఆసాంతం రాహుల్ గాంధీ తనకెదురైన అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలు వింటూ, భారోసానిస్తూ ముందుకు సాగారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఈ యాత్ర ద్వారా 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కోరిక నెరవేరుతుందో.. లేదో.. తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకూ ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE