దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఇకపై 24 గంటలు పాటుగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ” కరోనా వ్యాక్సినేషన్ వేగాన్నిపెంచడానికి ప్రభుత్వం సమయ పరిమితిని తొలగించింది. ప్రజలకు వారి సౌలభ్యం మేరకు 24×7 ఎప్పుడైనా ఆసుపత్రులు వారికీ వ్యాక్సినేషన్ వేయవచ్చు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరుల సమయం మరియు ఆరోగ్యం రెండింటి విలువను అర్థం చేసుకున్నారు” అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్ లోనే కాకుండా, కరోనా వ్యాక్సిన్ ను ఏ సమయంలోనైనా పంపిణీ చేసే వెసులుబాటు ఆసుపత్రులకు కలగనుంది. ఈ నియమం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా వర్తించనుంది.
ముందుగా కొ-విన్ యాప్ పోర్టల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనే పరిమితి ఏమి లేదని, రాత్రి 8 గంటల వరకు కూడా ఆసుపత్రులు వ్యాక్సినేషన్ చేపట్టవచ్చని, అలాగే కావాలనుకుంటే ఉదయం 8 గంటలకు నుంచి కూడా ప్రారంభించుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే షెడ్యూల్ మరియు వ్యాక్సిన్ పంపిణీ సామర్ధ్యానికి సంబంధించి ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేంద్రం తాజా నిర్ణయంతో కుదిరిన సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలకు సౌలభ్యం కలగనుంది. మరోవైపు మార్చి 3, బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 56 లక్షలు (1,56,20,749) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ