దేశ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల చుటూ తిరుగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ఈ ఎన్నికపై ఏకగ్రీవానికి ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీయేతర పార్టీలతో కీలక సమావేశాలు, సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీ అభ్యర్ధికి పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని ఆమె పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ అధినాయకత్వం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రంగంలోకి దించింది. ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి ఎన్నికను ఏకగ్రీవం చేయాలనీ సూచించింది.
దీంతో రాజ్నాథ్ సింగ్.. మమతా బెనర్జీ, కాంగ్రెస్కు చెందిన మల్లికార్జున్ ఖర్గే, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్, సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ తదితరులతో మాట్లాడారు. అలాగే 2020 అసెంబ్లీ ఎన్నికల నుండి బిజెపితో సంబంధాలు దెబ్బతిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కూడా మాట్లాడారు. బీజేపీ నిలబెట్టబోయే అభ్యర్ధికి మద్దతివ్వాల్సిందిగా వారిని కోరారు. కాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశమై జూన్ 26న ప్రారంభమయ్యే ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనకు ముందే అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రకటించనున్నారు.
ఇక మరోవైపు ఇదే అంశంపై చర్చించడానికి ప్రతిపక్ష నేతల బృందం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన మమతా బెనర్జీ.. తొలుత మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు సూచించారు. చాలామంది ఆ పేరును సమర్ధించారు కూడా. అయితే దీనిపై పవార్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వారు గోపాలకృష్ణ గాంధీ లేదా కశ్మీర్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై మరోసారి సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయానికి రావాలని మమత భావిస్తున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనుండగా జూలై 21న ఫలితాలు ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ