ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం యోగి నామినేషన్ వేస్తున్న సందర్భంగా.. బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ అగ్ర నేతలు పాల్గొన్నారు. దీనికిముందుగా గోరఖ్నాథ్ దేవాలయంలో సీఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఆయన ఐదుసార్లు గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం సీఎం యోగికి ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో.. గోరఖ్పూర్ అర్బన్ శాసన సభ నియోజకవర్గానికి పోలింగ్ మార్చి 3న జరుగనుంది. అనంతరం మార్చి 10న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ వేయడానికి ముందు ఆయనతో పాటు అమిత్ షా ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో యోగి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 370 అధికరణని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాగే, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామాలయం నిర్మాణం కలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహాకూటమిని బీజేపీ ఓడించిందని యోగి గుర్తుచేశారు. ఈ ఐదేళ్ళలో ఉత్తర ప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని.. ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు లబ్ధి పొందాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ