దేశ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కసరత్తు ముమ్మురం చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడానికి బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది.
ఈ కీలకమైన పార్టీ సమావేశానికి ముందు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ కావడంతో, రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును బరిలో ఉంచాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు తెలుస్తుంది.
మరోవైపు దేశంలోని 17 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి పదవికి తమ ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడానికి నేడు ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ అధ్యక్షత వహించనున్నారు. ముందుగా ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండేందుకు శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేయడంతో, తాజాగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. యశ్వంత్ సిన్హా ప్రస్తుతమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గాని, యూపీఏ/ఇతర విపక్షాలు కానీ తమ రాష్ట్రపతి అభ్యర్థులపై ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY