ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉదయం ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చరిత్ర విస్మరించిన స్వాతంత్య్ర యోధులను నేడు దేశం గౌరవించుకుంటోందని పేర్కొన్నారు. మన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట కాలంలో మన సమర యోధులు క్రూరత్వం ఎదుర్కోని ఒక్క రోజు కూడా లేదు. దానికి కృతజ్ఞతగా ఈ రోజు మనం వారికి నివాళులు అర్పించడం మన బాధ్యత. భారతదేశం కోసం వారి దార్శనికతను మరియు కలలను మనం గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. బాపూజీ మహాత్మా గాంధీ కన్న కలలను మనం నెరవేర్చినప్పుడే ఆయన త్యాగానికి మనం ఇచ్చే నివాళి అని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ వంటి వీరులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ.. ఈ క్రమంలో మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ తదితరులను స్మరించుకోవాలని కోరారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ, రామ్ మనోహర్ లోహియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప దార్శనికులకు కూడా మేము వందనం చేస్తున్నామని పేర్కొన్నారు. మన జాతి కొత్త సంకల్పంతో కొత్త దిశగా అడుగులు వేయాల్సిన రోజు ఇదని.. పాలనలో స్థిరత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశ పురోగతికి సరికొత్త మార్గంలో నాంది పలకాలని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని నోట కొత్త నినాదం – పంచప్రాణ్
మరో 25 సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం లభించి 100 సంవత్సరాలవుతుందని, ఈ నేపథ్యంలో మనం ‘పంచప్రాణ్’ అనే సంకల్పంతో దేశ అభివృద్ధికై పాటుపడాలని పిలుపునిచ్చారు. వీటిలో మొదటిది – పెద్ద సంకల్పం, రెండవది – బానిస మనస్తత్వాన్ని విడిచిపెట్టడం, మూడవది – మన వారసత్వం గురించి మనం గర్వపడాలి, నాల్గవది – ఐక్యత మరియు సంఘీభావం, ఇక ఐదవది – పౌరుల విధి అని ప్రకటించారు. వీటిని పాటిస్తూ రానున్న 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా అవినీతి, వారసత్వం అనే రెండు అవలక్షణాలను ఇప్పటికీ వదిలించుకోలేకపోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
మరోవైపు దేశంలో బంధుప్రీతి ఎంతగా వేళ్లూనుకుందో ప్రధాని వివరిస్తూ.. నేను బంధుప్రీతి గురించి మాట్లాడినప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని ప్రజలు అనుకుంటారు. కాదు, దురదృష్టవశాత్తూ దేశంలోని అనేక సంస్థలను బంధుప్రీతి పట్టి పీడిస్తోందని, ఇది దేశ ప్రతిభను, సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, అవినీతికి ఇది కూడా ఒక కారణమని ఆయన అన్నారు. అలాగే వంశపారంపర్య రాజకీయాలపై కూయద ప్రధాని విరుచుకుపడ్డారు. వంశపారంపర్య రాజకీయాలు కేవలం కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని, దేశ సంక్షేమాన్ని పట్టించుకోవని ప్రధాని మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY