చైనాలో 2020 నుంచి అమలులో ఉన్న కఠినమైన ‘జీరో-కోవిడ్’ విధానాన్ని ఎత్తివేసిన తర్వాత ఆ దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ‘టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్’ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు గుర్తించామని, పరిస్థితి యొక్క తీవ్రత గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాలని ఆ దేశాన్ని కోరామని తెలిపారు.
దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడంపై చైనా తన ప్రయత్నాలను కేంద్రీకరించాలని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చైనాకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక తాను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లుగా కోవిడ్-19 మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగి పోలేదని, కావున ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని టెడ్రోస్ సూచించారు. ఏడాది క్రితం కంటే ప్రస్తుతం మనం మెరుగైన స్థానంలో ఉన్నామని, అయితే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వేవ్ ప్రారంభమయినట్లు నివేదికలు వస్తున్నాయని తెలిపారు. ఇదే కొంత ఆందోళన కలిగిస్తోందని, కానీ మరణాల సంఖ్య దాదాపు 90% పడిపోవడం ఊరటనిచ్చే విషయమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ