కామన్ వెల్త్ గేమ్స్-2022లో జరుగుతున్న మహిళల క్రికెట్లో భారత్ మహిళల జట్టు ఫైనల్ కు చేరుకుంది. శనివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా జరుగుతున్న మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు ఫైనల్ కు చేరుకొని పతాకాన్ని ఖాయం చేసుకుంది. ముందుగా సెమీస్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన 32 బంతుల్లో 61 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసింది. రోడ్రిగస్ (44), దీప్తి శర్మ (22), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20) పరుగులతో రాణించారు. మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 2, కె బృంట్, ఎన్ స్కివేర్ చెరో వికెట్ తీశారు.
ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో ఎన్ స్కివేర్ (41), ఓపెనర్లు వ్యాట్ (35) మరియు సోఫీ డంక్లే 19, జోన్స్ (31) మాత్రమే కొంతమేర రాణించారు. చివరి ఓవర్ లో విజయం కోసం ఇంగ్లాండ్ జట్టు 14 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ బౌలర్ స్నేహ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నాలుగు పరుగులతో భారత్ విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ 1 వికెట్ పడగొట్టారు. కాగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో ముగ్గురు రన్ అవుట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మరో సెమీస్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం నాడు ఫైనల్లో భారత్ జట్టు తలపడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY