భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న లక్నోలో జరిగిన తోలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టు చివరివరకు పోరాడి సౌత్ ఆఫ్రికా చేత పరాజయం పాలయింది. ఇక రాంచీలో అక్టోబర్ 9న రెండవ వన్డే, ఆ తర్వాత న్యూఢిల్లీలో అక్టోబర్ 11న చివరిదైన మూడో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో మిగిలిన రెండు వన్డేలు ఆడబోయే భారత్ వన్డే జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పుపై బీసీసీఐ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బౌలర్ దీపక్ చాహర్ గాయపడడంతో, ఆ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వన్డే జట్టులోకి వచ్చాడని తెలిపారు.
“సౌత్ ఆఫ్రికాతో జరిగే మిగిలిన వన్డే సిరీస్కు దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నియమించింది. ఇండోర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడవ మరియు చివరి టీ20 తర్వాత చాహర్ వెన్నులో స్టీప్ నెస్ కు గురయ్యాడు. దీంతో లక్నోలో జరిగిన మొదటి వన్డేలో భారత్ తుది జట్టులో ఆడలేదు. దీపక్ చాహర్ తిరిగి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్తాడు, అక్కడ వైద్య బృందం అతన్ని పర్యవేక్షిస్తుంది” అని బీసీసీఐ ప్రకటించింది. కాగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో స్టాండ్ బై ప్లేయర్ జాబితాలో దీపక్ చాహర్ చోటు దక్కించుకున్నాడు. ఓ దశలో బుమ్రా స్థానంలో దీపక్ చాహర్ ప్రపంచకప్ జట్టులో చోటుదక్కించుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితి అనంతరం స్టాండ్ బై ప్లేయర్ ఉన్న దీపక్ చాహర్ ఆస్ట్రేలియా వెళ్లి జట్టుతో ఎప్పుడు కలవనున్నాడనే దానిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY