హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే ఆకర్షణీయంగా నిలిచింది. బాలాపూర్ లడ్డూ వేలం పాట గురువారం ఉదయం ముగిసింది. ఈ వేలం పాటలో మొత్తం 28 మంది భక్తులు పాల్గొనగా, మరోసారి రికార్డ్ స్థాయి ధర పలికింది. కొలను రామిరెడ్డి అనే వ్యక్తి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.16.60 లక్షల ధర పలకగా, ఈసారి లక్ష రూపాయలు ఎక్కువుగా పలికింది.
బంగారు పూతతో ఉన్న 21 కిలోల లడ్డూను వెండిపళ్లెంలో పెట్టి పాటపడిన కొలను రామిరెడ్డి కి అందజేశారు. ఈ లడ్డూను తాపేశ్వరం మిఠాయి తయారీదారులు చేసి అందజేసారు. గత సంవత్సరం ఈ లడ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు సొంతం చేసుకున్నారు. 2017 లో రూ.15.60 లక్షలకు నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్ లో లడ్డును వేలం పాట కొనసాగిస్తున్నారు. అప్పటినుంచి మొదలు ప్రతి సంవత్సరం రేటు పెరుగుతూనే వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=TUWwRDddROI]