ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో తన సొంత క్రీడా అకాడమీని ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. అకాడమీకి సంబంధించిన లోగోను డిసెంబర్ 10, మంగళవారం నాడు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాసియం ఉన్నాయి. మొదట్లో బ్యాడ్మింటన్పై దృష్టి సారించినప్పటికీ తర్వాత మిగిలిన క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు.
అకాడమీ లోగో ఆవిష్కరణ సందర్భంగా గుత్తా జ్వాల మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ను కేవలం బ్యాడ్మింటన్కు మాత్రమే పరిమితం చేయడం లేదు. మున్ముందు మరిన్ని క్రీడలను జోడిస్తాం. అమ్మానాన్నల ప్రోత్సాహంతో హైదరాబాద్లోని మొయినాబాద్ సుజాత హైస్కూల్ ప్రాంగణంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశాం. అకాడమీ నిర్మాణం కోసం ఎవరి సహాయం తీసుకోలేదు. సొంతంగా ఏర్పాటు చేశాను. విశాలమైన మైదానంలో అత్యాధునిక సదుపాయాలతో అకాడమీ ఏర్పాటైంది. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేలా శిక్షణ ఇస్తాం. అకాడమీలో కనీసం 10 మంది కోచ్లు ఉంటారు. అందులో ఇద్దరు విదేశీ కోచ్లు కూడా ఉన్నారని’ గుత్తా జ్వాల తెలిపారు. ఈ సందర్భంగా నటుడు సునీల్ శెట్టిని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడంపై గుత్తా జ్వాల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు బదులుగా ఒక క్రీడాకారుడిని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవాలని ఆమె అభిప్రాయపడింది. పలువురు సినీ ప్రముఖులు మరియు క్రీడాకారులు ట్విట్టర్లో వీడియోల ద్వారా అకాడమీని ఏర్పాటును ప్రోత్సహిస్తూ, గుత్తా జ్వాలకు అభినందనలు తెలియజేశారు.